తిరుపతి స్విమ్స్ క్యాజువాలిటీ లో బెడ్ల కొరత పై టీటీడీ ధర్మకర్తల మండలి ప్రత్యేకంగా దృష్టిసారించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, ఐ ఎన్ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
క్యాజువాలిటీ వార్డుకు అదనపు భవనాన్ని నిర్మించి బెడ్ల సంఖ్యను మరింత పెంచాలని ఆయన కోరారు. స్విమ్స్ తోపాటు క్వారంటైన్ సెంటర్లలో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు సిబ్బంది కరోనా వైరస్ బారిన పడకుండా నాణ్యమైన పిపి కిట్లను చేతి గ్లౌజ్ లను అందించి ప్రతి నిత్యం శానిటేషన్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
శ్రీవారి దర్శనానికి భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయం తగ్గడాన్ని టిటిడి ఉన్నతాధికారులు ధర్మకర్తల మండలి దృష్టిలో పెట్టుకొని దుబారా ఖర్చులు తగ్గించుకొని ఇతర రాష్ట్రాలలో నిర్మిస్తున్న రోడ్లు, ఆలయాలు,కల్యాణ మండపాల నిర్మాణాలను రెండు సంవత్సరాల పాటు వాయిదా వేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చిన నిధులను “మానవసేవే మాధవసేవ” నినాదంతో స్విమ్స్ లో వైద్య సదుపాయాల కోసం మెరుగైన సౌకర్యాల కోసం వెచ్చించాలని నవీన్ కుమార్ రెడ్డి కోరారు.