10 సంవత్సరాలకు పైగా చాలీచాలని జీతాలతో తిరుమల తిరుపతి దేవస్థానాలలో ఔట్ సోర్సింగ్ కార్మికులుగా పని చేస్తున్న 2300 మందికి కరోనా కష్టకాలంలో జీతాలు చెల్లించకపోవడం దారుణమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉద్యోగం పూర్వజన్మ సుకృతం అన్న విశ్వాసంతో ఉన్నత చదువులు చదివి కూడా వారు కాంట్రాక్టు కార్మికులుగా పని చేస్తున్నారని ఆయన అన్నారు. టిటిడి అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న సూపర్వైజర్లకు రూ.9000, టెక్నీషియన్ కు రూ.11000, కార్మికులకు రూ.7500 జీతం ఇస్తున్నా ఏనాటికైనా టైం స్కేల్ ద్వారా శాశ్వత ఉద్యోగం రాకపోతుందా అన్న ఆశతో కార్మికులు పని చేస్తున్నారని ఆయన అన్నారు.
ఈ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత టీటీడీ తో పాటు తిరుమల కొండపై గత కొన్ని సంవత్సరాలుగా టెండర్లు తీసుకుంటున్న 4 ఏజెన్సీ గుత్తేదారుల పై కూడా ఉందని ఆయన అన్నారు. తిరుమలలో ఒక్కొక్క ఏజెన్సీకి ప్రతి నెల 50 లక్షలు అంటే నాలుగు ఏజెన్సీలకు సుమారు రెండు కోట్లు ఎటువంటి ఆలస్యం లేకుండా టీటీడీ ప్రతి నెల చెల్లిస్తూ వచ్చింది.
అనుకోని విపత్కర పరిస్థితులలో లాక్ డౌన్ కారణంగా తిరుమల కొండపై భక్తులను అనుమతించకపోవడంతో 2300 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులకు గత రెండు నెలలుగా పనులు లేకపోవడం వాస్తవం వారికి జీతాలు ఎలా చెల్లించాలి ఆడిట్ సమస్య వస్తే ఎలా అని ఇంజనీరింగ్ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
టీటీడీ ఈవో చొరవ తీసుకొని ఔట్సోర్సింగ్ కార్మికుల జీతాలకు సంబంధించి ఆడిట్ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎదురు చూడకుండా చెల్లించాలని నవీన్ కుమార్ రెడ్డి కోరారు.