తిరుమలలో అద్దె గదులకు చెల్లించిన డిపాజిట్ నగదు 10 రోజులు గడిచినా భక్తుల ఖాతాలలో జమ కావడం లేదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రపంచమంతా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని గంటల వ్యవధిలో లక్షలాది రూపాయలను on-line ద్వారా దేశవిదేశాలకు బదిలీలు చేస్తున్నారు అలాంటిది టీటీడీ లాంటి అతి పెద్ద ధార్మిక సంస్థ భక్తులు చెల్లించిన డిపాజిట్ వెనక్కి ఇవ్వడంలో జరుగుతున్న ఆలస్యంపై ఏం చెబుతుందని ఆయన ప్రశ్నించారు.
త్వరలో జరగబోయే ధర్మకర్తల మండలి సమావేశంలో కనీసం ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమలలో రూ.50, రూ 100 చెల్లించాల్సిన అద్దె గదులకు సైతం డిపాజిట్ తీసుకుంటున్నారని ఆయన అన్నారు. అలాగే వెయ్యి, రెండు వేలు, 5000 రూపాయలు చెల్లించాల్సిన అద్దె గదులకు అదే మొత్తంలో డిపాజిట్ తీసుకుంటున్నారని ఆయన అన్నారు.
అలాంటప్పుడు తిరిగి కనీసం 48 గంటలలో నైనా భక్తుల ఖాతాలలో జమ అయ్యే విధంగా టిటిడి అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమలలో వసతి సముదాయాలకు భక్తుల నుంచి డిపాజిట్లు స్వీకరించడం మంచి నిర్ణయమే కానీ గదులు ఖాళీ చేసిన వెంటనే “రీఫండ్ కౌంటర్లను” ఏర్పాటు చేసి నగదు తిరిగి చెల్లిస్తే సుదూర ప్రాంతాల నుంచి రైలు,బస్సు మార్గాలలో వచ్చిన భక్తులకు తిరుగు ప్రయాణంలో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు.
టీటీడీలో అధికారులు మారినప్పుడల్లా గదుల కేటాయింపులో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకొని శ్రీవారి భక్తులపై ప్రయోగాలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.