తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినిధులు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలను కలిసారు. స్వామీజీలకు శ్రీవారి శేష వస్త్రంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. చాతుర్మాస్య దీక్ష కోసం రిషికేష్ లో ఉన్నందున అక్కడికే వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసారు.
తనను కలిసిన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో ధర్మారెడ్డిలకు ఆశీస్సులు అందించారు స్వామి స్వరూపానందేంద్ర. ఈ సందర్భంగా స్వామీజీలు చేపట్టిన చాతుర్మాస్య దీక్ష వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినిధులతో పలు ధార్మిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక అంశాలను కాగ్ పరిధిలోకి తీసుకొచ్చే యోచన ఆహ్వానించదగ్గ పరిణామమని స్వామి స్వరూపానందేంద్ర అభినందించారు.
అలాగే గుడికో గోవు కార్యక్రమం చేపట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తిరుమల తిరుమతి దేవస్థానం ధార్మిక నిర్ణయాలు తీసుకునేటపుడు సాంప్రదాయ గురువులను సంప్రదించాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో భజన మండళ్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. వేంకటేశ్వర స్వామి ఆలయాలను ముఖ్య నగరాలతో పాటు హరిజన, గిరిజన ప్రాంతాల్లోనూ నిర్మించాలని సూచించారు.