తిరుమలలో ఇద్దరు రూ. 300/- దర్శన టికెట్ల దళారులను టిటిడి విజిలెన్స్ విభాగం పట్టుకుని, వారిపై తిరుమలలోని టు టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు.
ఈ నకిలీ టికెట్ల విక్రయంలో కడపకు చెందిన వినయ్, తిరుమలలో ప్రైవేట్ ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్న వేణు ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు అవసరమైన డేటా మార్పులు చేయడం ద్వారా వారు భక్తులకు ఏడు నకిలీ టిక్కెట్లను ఏర్పాటు చేసి, విక్రయించినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు.
టిటిడి విజిలెన్స్ అధికారులు అందించిన సమాచారం మేరకు, జనవరి 23న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల స్కానింగ్ కౌంటర్ల వద్ద టిటిడి విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నకిలీ దర్శన టిక్కెట్లను పట్టుకున్నారు. ఇందులో హైదరాబాద్కు చెందిన శ్రీ ఎస్.సైదులు మరియు అతని ఆరుగురు బంధువులను విచారించగా, తమకు వేణు, వినయ్ కలిసి ఏడు రూ. 300/- టికెట్లను విక్రయించినట్లు తెలిపారు. తాము వారికి గూగుల్ పే ద్వారా రూ.5600/-, క్యాష్ రూపంలో రూ. 1000/- అందించినట్లు చెప్పారు.
యాత్రికుల ఫిర్యాదు మేరకు టిటిడి విజిలెన్స్ అధికారులు ఇద్దరు దళారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం తిరుమల టు టౌన్ పోలీస్ స్టేషన్లో Cr.no.11/ 2022, U/S 420 & 468 IPC క్రింద కేసు నమోదైంది.