సానిటయిజర్ తాగి కడప జిల్లాలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మద్యం తాగే అలవాటున్న ఓ తల్లీ కొడుకులు మద్యం దొరకకపోవడంతో మత్తు కోసం సానిటయిజర్ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. సానిటయిజర్ కూడా మత్తు ఇస్తుందని దాని తాగడంతో ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకుని చివరకు ప్రాణాలొదిలారు.
కడప జిల్లా చెన్నూరు మండల కేంద్రంలోని ఎల్లమ్మ గుడి వీధిలో నివాసం ఉంటున్న విజయలక్ష్మి ఆమె కొడుకు శ్రీరామ్ నాయక్ లకు మద్యం సేవించి అలవాటు ఉంది. నిన్న రాత్రి పది గంటల ప్రాంతంలో వీరిద్దరూ మద్యం సేవించేందుకు సిద్ధపడగా వారికి మద్యం దొరకలేదు.
దీంతో వారిద్దరూ అందుబాటులో ఉన్న సానిటయిజర్ తాగేశారు. సానిటయిజర్ కూడా మత్తు ఇస్తుందని ఎవరో చెప్పడంతో ఇరువురు సానిటయిజర్ ను తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు తల్లీ కొడుకును వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే పరిస్థితి విషమించడంతో తల్లీ కొడుకు మృత్యువాత పడ్డారు. కేవలం మత్తు కోసమే ఇరువురు సానిటయిజర్ తాగినట్లు చెన్నూరు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.