గొర్రెలు కాసుకోవడానికి వెళ్లి ఇద్దరు యువకులు శవాలుగా మారడంతో కడపజిల్లా సుండుపల్లి మండలంలోని మడితాడు గ్రామ పంచాయతీ కొండ్రెడ్డి గారి పల్లెలో విషాదం చోటు చేసుకుంది. మరణించి ఇద్దరిని రామాంజనేయులు అలియాస్ ఆనంద్, సంజీవగా పోలీసులు గుర్తించారు.
ఈ ఇద్దరూ గొర్రెలు తీసుకుని మేపేందుకు పొలానికి వెళ్లారు. సాయంత్రానికి గొర్రెలు మాత్రమే ఇంటికి తిరిగివచ్చాయి. ఇంట్లోని వారు రాత్రి అంతా ఎదురు చూసినా ఇద్దరూ ఇళ్లకు తిరిగిరాలేదు. అందరూ రాత్రి నుండి వెతకగా పక్కనే జీకే రాచపల్లెలో ఉండే చెరువులో నేటి ఉదయం మృతదేహాలు కనిపించాయి.
చెరువులో ఈత కొడుతూ మునిగిపోయి చనిపోయారా? లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుండుపల్లి ఎస్సై భక్తవత్సలం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.