36.2 C
Hyderabad
April 25, 2024 21: 37 PM
Slider ప్రత్యేకం

భూ సేకరణలో కోర్టు ధిక్కరణపై ఇద్దరు ఐఏఎస్ లకు జైలు శిక్ష

#IASOfficers

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అనంతగిరి రిజర్వాయర్‌ భూసేకరణ వ్యవహారంలో ఇద్దరు కలెక్టర్లకు రాష్ట్ర హైకోర్టు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది.  కోర్టు ధిక్కరణకు పాల్పడిన రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ డి.కృష్ణభాస్కర్‌, అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా (ప్రస్తుతం వనపర్తి జిల్లా కలెక్టర్‌), భూసేకరణ అధికారి ఎన్‌.శ్రీనివాసరావులకు మూడు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.

11 మంది పిటిషనర్లకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఖర్చుల కింద చెల్లించాలని కూడా ఆదేశించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామానికి చెందిన వి.ముత్తారెడ్డి, మరో 10 మంది రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారించిన జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు ఈ తీర్పు వెలువరించారు.

అనంతగిరి రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా 69.22 ఎకరాలు, 257.37 ఎకరాల భూసేకరణ కోసం 2017లో ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ చేపట్టలేదని, గ్రామసభలను నిర్వహించలేదని, అభ్యంతరాలను స్వీకరించలేదంటూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

పునరావాస ప్యాకేజీ ఇవ్వకుండా భూమిని స్వాధీనం చేసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై విచారించిన హైకోర్టు పునరావాసం ప్యాకేజీ కల్పించేదాకా భూములను స్వాధీనం చేసుకోరాదని, వాటిని ముంపునకు గురి చేయరాదంటూ 2018 అక్టోబరులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా పునరావాస ప్యాకేజీ ఇవ్వకుండా భూములను 2019లో ముంపునకు గురి చేయడంతో రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. చట్టప్రకారం పునరావాస అవార్డు ప్రకటించామని ప్రభుత్వం తెలిపింది. దీనిపై పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇళ్లకు చెందిన స్థలాల సేకరణకు పునరావాస పరిహారం చెల్లించారన్నారు.

వ్యవసాయ భూములకు పునరావాస ప్యాకేజీ చెల్లించలేదన్నారు. వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసినపుడు పునరావాస ప్యాకేజీ కూడా వేర్వేరుగా ఉండాలన్నారు. ఇందులో ప్రభుత్వం 500 పేజీలకు పైగా ఉన్న కౌంటరును దాఖలు చేస్తూ నిబంధనల ప్రకారం భూసేకరణ జరిగినట్లు పేర్కొన్నారు.

ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి భూమిని స్వాధీనం చేసుకోరాదంటూ ఈ కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని, వాటిని ఎత్తివేయకుండా భూములను ముంపునకు గురి చేయడం కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అప్పీలు చేసుకోవడానికి వీలుగా ఆరువారాల పాటు ఈ తీర్పును నిలిపేశారు. అయితే వారి సర్వీసు రికార్డుల్లో దీనిని నమోదు చేయాలని ఆదేశించారు.

Related posts

ప్రతి ఒక్కరూ మెచ్చే చిత్రం మాతృదేవోభవ (ఓ అమ్మ కథ)

Satyam NEWS

ఖమ్మం పోలీస్ శాఖ కు మినీ ట్రాక్టర్ అందజేసిన వీవీసీ ట్రస్ట్

Satyam NEWS

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ ఏమన్నారంటే

Satyam NEWS

Leave a Comment