మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ లో ఈదురు గాలుల బీభత్సానికి దంపతులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని మిడ్జిల్ మండలం మున్ననూరులో నిర్మాణంలో ఉన్న టోల్గేట్ రేకులు ఎగిరిపడి దంపతులపై పడడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మున్ననూరులో కొత్తగా టోల్గేట్ నిర్మిస్తున్నారు. నిర్మాణ పనుల్లో భాగంగా ఇనుపకడ్డీలు, రేకులతో టోల్గేట్ పైకప్పును నిర్మించారు.
నిర్మాణం చేపట్టిన పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించక పోవడం వల్ల మున్ననూరు గ్రామానికి చెందిన కృష్ణయ్య, 8 వ వార్డు సభ్యులు పుష్ప దంపతులు టోల్గేట్ సమీపంలో రోడ్డుపై వడ్లు ఆరబోశారు. వర్షం వల్ల ఆరబోసిన ధాన్యం తడిసిపోతుందని వడ్లను కుప్పగా చేద్దామని భార్యభర్తలు అక్కడికి వెళ్లారు. ఇదే సమయంలో బలమైన ఈదురుగాలుల ధాటికి నిర్మాణంలో ఉన్న టోల్గేట్ రేకులు ఎగిరిపడ్డాయి.
రేకులు బలంగా తగలడంతో దంపతులిద్దరూ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. రైతు దంపతుల మృతితో మున్ననూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. విగతజీవులుగా పడిఉన్న వారిని చూసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. RDO శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు.