పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే దిగున స్పిల్ చానల్లో నాటు పడవ బోల్తా పడి ఇద్దరు మత్స్యకారులు గల్లంతయిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలవరం ఏఎస్ఐ రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పాత పోలవరం గ్రామానికి చెందిన కొంతమంది మత్స్యకారులు ఇంజన్ బిగించిన 20 నాటు పడవల్లో సాయంత్రం 4.30 గంటలకు పోలవరం ప్రాజెక్టు స్పిల్వే గేట్ల వద్దకు చేపల వేటకు వెళ్లారు.
సాయంత్రం 6 గంటలకు వేటాడే క్రమంలో వాటాల వీరబాబు కి చెందిన పడవ ఇంజన్ ఆగిపోయి నీటి ప్రవాహ వేగానికి బోల్తాపడడంతో పడవ ఉన్న వాటాల వీరబాబు, వాటాల సింహాచలం, పొన్నాడి పోశియ్య, వాటాల అప్పలస్వామి, సూరిమిల్లి కృష్ణమూర్తి గోదావరిలో పడిపోయారు . అది గమనించిన సమీపంలో ఉన్న మత్స్యకారులు పడవలతో వెళ్లి తాళ్ల సహాయంతో రక్షించారు అయితే వారిలో వాటాల వీరబాబు, వాటాల సింహాచలం, పొన్నాడి పోసియ్య ముగ్గురు క్షేమంగా బయటపడగా, వాటాల అప్పలస్వామి సూరిమిల్లి కృష్ణమూర్తిలు గల్లంతయ్యారు.
తీవ్ర గాయాలు తీవ్ర గాయాల పాలైన వీరబాబు, స్వల్ప గాయాలతో బయటపడ్డ వాటాల సింహాచలం, పొన్నాడి పోసియ్య ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, గల్లంతయిన వారి ఆచూకీ కోసం గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు ఏఎస్ఐ రాజకుమార్ తెలిపారు.