దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు ఇద్దరు నిరాయుధులైన పోలీసులను అతి కిరాతకంగా కాల్చి చంపారు. జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో నేడు పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది.
శ్రీనగర్ లోని అప్ మార్కెట్ ప్రాంతంలో ఎలాంటి ఆయుధాలు లేకుండా నిలబడి ఉన్న ఇద్దరు పోలీసులపై ఒక ఉగ్రవాది ఎడతెగకుండా గుళ్ల వర్షం కురింపించారు.
రెండు రోజుల కిందట ఇదే తరహా సంఘటన జరిగింది. మళ్లీ అదే విధంగా ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులకు తెగబడటం ఆందోళన కలిగిస్తున్నది.
శ్రీనగర్ లోని హై సెక్యూరిటీ ప్రాంతం అయిన ఎయిర్ పోర్టు రోడ్డులో ఈ విధంగా జరగడం ప్రమాదకర పరిస్థితులను సూచిస్తున్నది.
తన దుస్తుల కింద దాచుకున్న రైఫిల్ ను ఒక్క సారిగా బయటకు తీసి ఆ దుర్మార్గుడు కాల్పులు జరిపాడు. అందరూ చూస్తుండగానే పోలీసులు రక్తం మడుగులో పడిపోయారు.
ప్రజలు భయ భ్రాంతులకు గురై హాహాకారాలు చేస్తున్న సమయంలో కాల్పులకు తెగబడ్డ వాడు పారిపోయాడు.
బుల్లెట్ గాయాలై తీవ్రంగా రక్త స్రావం అవుతున్న ఇద్దరు పోలీసులను సమీపంలోని ఎస్ఎం హెచ్ ఎస్ ఆసుపత్రికి తరలించగా సుహేల్ అనే కానిస్టేబుల్ ముందుగా ప్రాణాలు విడిచాడు.
అనంతరం కొద్ది సేపటికే మహ్మద్ యూసఫ్ అనే కానిస్టేబుల్ కూడా తుది శ్వాస విడిచాడు.
కాల్పులకు తెగబడ్డ వాడ్ని షాకిబ్ అనే ఉగ్రవాదిగా గుర్తించారు. సిసి టివి ఫుటేజీ ఆధారంగా షాకిబ్ కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.