గ్రామ సచివాలయాలు ఉన్నది ఎందుకు పాలన ప్రజలకు చేరువ చేయడానికి. అంతే కదా? కాదు అంటున్నారు ఈ గ్రామ సచివాలయ సిబ్బంది. సచివాలయం ఉన్నది ‘మన్మధ రాజా’ సాంగ్ వేసుకోవడానికి అని వారంటున్నారు. అంతే కాదు ఆఫీసులోనే డ్యాన్స్ చేసుకోవడానికే మహిళా వాలంటీర్లు ఉన్నారని కూడా వీరు చెబుతున్నారు.
రాష్ట్రంలో గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలనే ఉద్దేశ్యంతో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఎంతోమంది వాలంటీర్ సిబ్బంది ప్రజలకు సంక్షేమ పధకాలు అందిస్తూ ప్రశంసలు అందుకుంటుంటే. మరికొంతమంది మాత్రం వినోదాలతో కాలక్షేపం చేస్తున్నారు.
చిత్తూరులోని కట్టమంచి సచివాలయంలో వాలంటీర్లు కార్యాలయంలోనే డ్యాన్సులు చేయడం వివాదాస్పదమైంది. మోనికా, జగదీష్ అనే వాలంటీర్లు.. ముఖానికి రంగులు పూసుకుని ఓ సినిమా పాటకు డ్యాన్స్ చేస్తూ ఉండడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆఫీసులో, పని వేళల్లో ఈ చిందులేంటి అంటూ నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కాగానే వారిని సస్పెండ్ చేస్తున్నట్లు మునిసిపల్ కమిషనర్ ప్రకటించారు… అదీ సంగతి.