శ్రీమన్నార్ రాజగోపాలస్వామి ఆలయాన్ని పరిశీలించిన అధికారులు
కళలకు కాణాచి అయిన విజయనగరం జిల్లా కేంద్రంలో వచ్చే నెల నిర్వహించనున్న శుభకృత్ నామ ఉగాది నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు ప్రభుత్వ శాఖల అధికారులు సహకరించాలని జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు కోరారు. ఆయా శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి వేడుకలను విజయవంతం చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ సూర్యకుమారి నేతృత్వంలోని జిల్లా యంత్రాంగం ఈ ఏడాది వేడుకలను నగరంలోని ప్రాచీన దేవాలయం శ్రీమన్నార్ రాజగోపాల స్వామి ఆలయం వేదికగా నిర్వహించేందుకు నిర్ణయించారని పేర్కొన్నారు. ఈ ఆలయం విశిష్టతను, రాతి కట్టడాలతో కూడిన శిల్ప కళాసంపదను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో ఉగాది వేడుకలను ఇక్కడ నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ సంకల్పించారని తెలిపారు.
ఈ మేరకు జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు నేతృత్వంలో డి.ఆర్.ఓ. గణపతిరావు సహా పలువురు జిల్లా అధికారులు ఉగాది వేడుకలకు వేదికైన శ్రీమన్నార్ రాజగోపాలస్వామి వారి ఆలయాన్ని సందర్శించి వేడుకల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. వేదిక అలంకరణ, ఉగాది పచ్చడి తయారీ, అతిథులకు ఆహ్వాన పత్రికలు పంపించడం వంటి ఏర్పాట్ల బాధ్యతలను పలు శాఖల జిల్లా అధికారులకు అప్పగిస్తూ ఆదేశాలు జారీచేశారు.
ఏప్రిల్ 2 ఉగాది రోజు ఉదయం 9 గంటల తర్వాత వేడుకలు ప్రారంభమవుతాయని, జిల్లా మంత్రులు, జిల్లాపరిషత్ ఛైర్మన్, ఎంపిలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు ఇతర స్థానిక ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని జె.సి. పేర్కొన్నారు. ఆలయం లోపల మండపం వద్ద ఈ వేడుకలను నిర్వహించడం జరుగుతుందన్నారు.
వేదాల పఠనం, పంచాంగ శ్రవణం, ఎం.ఆర్.ప్రభుత్వ సంగీత కళాశాల విద్యార్ధులతో కీర్తనల ఆలాపన, అతిథుల సందేశాలు ఉంటాయన్నారు. నూతన జిల్లాల ఏర్పాటు కార్యక్రమం వున్నప్పటికీ జిల్లా కేంద్రంలో ఉగాది వేడుకలకు యథాతథంగా జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్(ఆసరా)తోపాటు జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, జిల్లా అధికారులు స్వామి వారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ ప్రసాదరావు, ఎస్.సి.కార్పొరేషన్ ఇ.డి., మెప్మా పి.డి. సుధాకర్, పర్యాటక అధికారి లక్ష్మీనారాయణ, చేనేత జౌళిశాఖ ఏ.డి. పెద్దిరాజు, ఐ.సి.డి.ఎస్. పి.డి. రాజేశ్వరి, పైడితల్లి అమ్మవారి ఆలయం ఇ.ఓ. కిషోర్, తహశీల్దార్, ఎం.ఆర్.ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ ప్రసన్నకుమారి, గ్రామీణ నీటిసరఫరా విభాగం ఎస్.ఇ. శివానందకుమార్, నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అధికారి ఆర్.నరేంద్ర, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, ఉద్యానశాఖ అధికారి రామరాజు తదితరులు పాల్గొన్నారు.