మాజీ మంత్రి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. రోజువారీగా 95 రోజుల నుంచి దర్యాప్తు చేస్తోంది. తాజాగా, ఈకేసులో సీబీఐ అధికారులు మరో నిందితుడిని గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. సింహాద్రిపురం మండలం కుంచేకుల గ్రామానికి చెందిన ఉమాశంకర్రెడ్డిని ఉదయం నుంచి విచారించిన అధికారులు సాయంత్రం అతడిని అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. వివేకా పొలం పనులు చూసే జగదీశ్వర్రెడ్డి సోదరుడే ఉమా శంకర్రెడ్డి అని సీబీఐ అధికారులు వెల్లడించారు.
ఈ కేసులో ఇప్పటికే సునీల్ యాదవ్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కడప సెంట్రల్ జైలు అతిథి గృహంలో చేపట్టిన విచారణకు ఉమాశంకర్ రెడ్డితోపాటు భరత్కుమార్ యాదవ్ హాజరయ్యారు. భరత్ పులివెందులకు చెందిన సునీల్కుమార్ యాదవ్ బంధువు. భరత్కుమార్, ఉమాశంకర్రెడ్డిని ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు. హత్య కేసులో వీరి నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. అలాగే, మరికొంతమంది అనుమానితులను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
హత్యకు ఉపయోగించినట్టు భావిస్తున్న ఆయుధాలు, ఇతర కీలక డాక్యుమెంట్లను సీబీఐ గతంలో సీజ్ చేసినట్టుగా ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఈ కేసులో హంతకులను పట్టిస్తే నజరానాను ఇస్తామని సీబీఐ ప్రకటించడం చర్చకు దారితీసింది. ఈ కేసులో పలువురు అనుమానితులతో పాటు వివేకానందరెడ్డి సోదరులను కూడ విచారించింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ అసలు నిందితులెవరో దొరకలేదు.