టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 వరల్డ్కప్ జరగనుండగా.. ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు. 2014లో మహేంద్రసింగ్ ధోనీ నుంచి టెస్టు టీమ్ పగ్గాలు అందుకున్న కోహ్లీ.. 2017 నుంచి వన్డే, టీ20 కెప్టెన్గా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టాడు.
కానీ.. కోహ్లీ కెప్టెన్సీలో భారత్ జట్టు కనీసం ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. మరోవైపు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. కోహ్లీ లేని సమయాల్లో కెప్టెన్గా ఉండటమే కాకుండా నిదహాస్ ట్రోఫీలో భారత్ జట్టుని విజేతగా నిలిపాడు. దానికి తోడు అతని కెప్టెన్సీలోని ముంబయి ఇండియన్స్ ఏకంగా ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచింది. ఐపీఎల్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కనీసం ఒక్క టైటిల్ని కూడా కోహ్లీ అందించలేకపోయిన విషయం తెలిసిందే.
రోహిత్ శర్మ ఇప్పటికే 19 టీ20ల్లో భారత్ జట్టుని నడిపించగా.. అతనికే టీ20 పగ్గాలు దక్కే అవకాశం ఉంది. వాస్తవానికి విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగబోతున్నట్లు మూడు రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. బ్యాటింగ్పై ఎక్కువ ఫోకస్ చేసేందుకు.. అలానే పని భారం తగ్గించుకునేందుకు కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. కానీ.. బీసీసీఐ సెక్రటరీ జై షాతో పాటు ట్రెజరర్ అరుణ్ ధుమాల్ వాటిని ఖండించారు. అయితే రోజుల వ్యవధిలోనే కోహ్లీనే స్వయంగా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం గమనార్హం.
కోహ్లీ ట్వీట్ .. వైరల్..
భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా, టీమిండియాను నడిపించే అదృష్టం నాకు దక్కింది. క్రికెట్ జట్టు కెప్టెన్గా నా ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలెక్షన్ కమిటీ, కోచ్లు ఇలా ప్రతిఒక్కరికి థ్యాంక్యూ. భారత్ గెలవాలని ప్రార్థించిన ప్రతి భారతీయుడికి కూడా. వీరందరి సహకారం లేకుండా నేను ఇది సాధించేవాడిని కాదు. పనిభారాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. గత 8, 9 సంవత్సరాలుగా మూడు ఫార్మాట్లలో ఆడుతున్నాను. గత ఐదారేళ్లుగా క్రమం తప్పకుండా కెప్టెన్ బాధ్యతలు మోస్తున్నాను. టెస్టులు, వన్డేల్లో టీమిండియాకు నాయకత్వం వహించడానికి నేను పూర్తి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది.
టీ20 కెప్టెన్గా జట్టుకు నాకు సాధ్యమైనంత వరకు సహాయ సహకారాలు అందించాను. ఇకపై టీ20 జట్టులో బ్యాట్స్మన్గా కొనసాగుతాను. వాస్తవానికి ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పట్టింది. రవి భాయ్, రోహిత్తో చర్చించిన తర్వాతే అక్టోబర్లో దుబాయ్లో జరిగే టీ20 ప్రపంచ కప్ తర్వాత నేను టీ20 కెప్టెన్గా వైదొలగాలని నిర్ణయించుకున్నాను’ అని కోహ్లీ పేర్కొన్నారు. టీ20 కెప్టెన్గా విరాట్ కోహ్లీ సేవలు మర్చిపోలేమని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా చెప్పారు. ఇది కోహ్లీ వ్యక్తిగత నిర్ణయమని, దాన్ని తాము గౌరవిస్తామని ఆయన ట్వీట్ చేశారు.