రాష్ట్రంలో వై స్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం నిలుపుదల చేస్తుందనే విషయం తాను ముందే ఊహించి చెప్పానని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
పాదయాత్ర సందర్భంగా పోలవరంను జగన్ పదేపదే విమర్శించారని, ఇప్పుడు దాని ప్రభావం పడిందని అన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. పోలవరంపై కేంద్రం మాటమార్చినప్పుడు ఒక కౌంటర్ దాఖలు చేస్తే సరిపోయేదని ఆయన చెప్పారు.
కేంద్రంపై కేసు ఎందుకు వేయడం లేదని ఉండవల్లి ప్రశ్నించారు. ఇప్పటికీ అన్నిటికీ టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని విమర్శలు గుప్పిస్తున్నారని, జనాలు 151 సీట్లను ఇచ్చింది చంద్రబాబును విమర్శించడానికి కాదని ఆయన అన్నారు.
ఎన్నికల ముందు రాజమండ్రి ప్రచారసభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, చంద్రబాబుకు పోలవరం ఏటీఎంలా మారిందని చెప్పారని, ఆ తర్వాత అప్పటి జలశక్తి మంత్రి కటారియా పార్లమెంటులో మాట్లాడుతూ పోలవరంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రకటించారని చెప్పారు.
మోదీ మాటలకు, కేంద్ర మంత్రి ప్రకటనకు పొంతనే లేదని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వం పోలవరం బాధ్యతల నుంచి తప్పుకుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విభజన చట్టంలోనే ఉందని… దీని గురించి మోదీ కాలర్ పట్టుకోవాల్సిన అవసరం లేదని, కేవలం కోర్టులో కేసు వేస్తే సరిపోతుందని చెప్పారు. ఈ పని కూడా జగన్ చేయలేకపోతున్నారని విమర్శించారు.