చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గుడుపల్లిలో దారుణ ఘటన జరిగింది. చదువులతల్లి అయిన ప్రియ అర్ధంతరంగా అత్యంత విషాదకరమైన రీతిలో తనువు చాలించింది. ఓవైపు నిరుద్యోగం, మరోవైపు కటిక దారిద్య్రం, ఇంకో వైపు చెల్లెలి అనారోగ్యం…. లాంటి సమస్యలు ఈ చదువుల తల్లిని చుట్టుముట్టాయి.
జానకిరామ్ , నాగలక్ష్మిలకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ప్రియ(24), మరో కుమార్తె ఝాన్సీ ఉన్నారు. ప్రియ కార్వేటినగరంలో TTC చేసి డిఎస్ సి లో క్వాలిఫై అయ్యింది . ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంది. ఈ లోపు RRB రాసి ఒక్క మార్కులో పోయింది.
ఇదిలావుండగా ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి సచివాలయంలో అయినా ఉద్యోగం రాకపోదా అనే గంపెడాశతో ఆదివారం తిరుపతిలో ప్రాక్టికల్ పరీక్ష రాసి గుడుపల్లికి చేరుకుంది. సోమవారం రాత్రి ఏమైందో ఏమో తెలియదు గానీ రైలుకింద పడి తనువు చాలించింది. ఈమేరకు కుప్పం రైల్వే ఎస్సై కె.బలరాం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.