కరోనా అదుపు చేసేందుకు తీసుకువచ్చిన వ్యాక్సిన్ విధానంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది.
వ్యాక్సిన్ లను కొనుగోలు చేయడంలో ద్వంద్వ విధానాలు ఎందుకు పాటిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ ల ధరలు ఒకే విధంగా ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.
ఈ అంశంపై జస్టిస్ డి వి చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారంనాడు విచారణ చేపట్టింది.
వ్యాక్సిన్ లు ఎక్కువ మోతాదులో కొనుగోలు చేయడం వల్ల తమకు తక్కువ ధరకు వస్తున్నాయని కేంద్రం చెబుతున్నది.
కేంద్రం కొన్న విధంగా రాష్ట్రాలు ఎక్కువ వ్యాక్సిన్ ను కొనుగోలు చేయలేవు కాబట్టి ధర పెరుగుతున్నది. అలా కాకుండా దేశం మొత్తం లో వ్యాక్సిన్ ధర ఒకేలా ఉండాలి అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.