కేంద్రం నిధులు ఖర్చు చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ రెడ్డి తన పేరు వేసుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. కడప జిల్లా బద్వేలు బిజెపి కార్యాలయంలో నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. బద్వేలు లో కేంద్రం ఇచ్చిన నిధులను అంకెల తో సహా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ట్విట్టర్ ద్వారా తెలియ చేశారని ఆయన వెల్లడించారు.
బద్వేలు లోని 7 మండలాలు, మున్సిపాలిటీ కి దాదాపు 60 నుంచి 70 కోట్ల నిధులు కేంద్రం కేటాయించిందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం 6 కోట్లు కూడా కేటాయించలేదని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. బద్వేల్ లో జరుగుతున్న ఉప ఎన్నికలు అభివృద్ధి కి అవినీతికి మధ్య ఎన్నికలు గా ఆయన అభివర్ణించారు. సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి రెండున్నర ఏళ్లలో బద్వేలు లో ఎలాంటి అభివృద్ధి చేశారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ట్విట్టర్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అడిగిన ప్రశ్నలకు వైసీపీ సమాధానం చెప్పాలని ఆయన కోరారు.