కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం నియోజకవర్గం లోని జక్కుల నెక్కలం గ్రామంలో రైతులను ఆమె కలుసుకున్నారు.
మంత్రి తో పాటు ఈ సమావేశంలో బిజెపి నాయకులు సునీల్ ధియోధర్, జీవియల్, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. రైతులు పండిస్తున్న పంటలు, గిట్టుబాటు ధర, మార్కెట్ లో పరిస్థితి రైతులను అడిగి ఆమె తెలుసుకున్నారు.
ధాన్యం, చెరకు గిట్టుబాటు ధర ఉండటం లేదని అందువల్ల ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు. చెరకు పంటకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదని కూడా వారు కేంద్ర మంత్రికి తెలిపారు. వరి కి క్వింటాకు రెండువేల రూపాయలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్రం తెచ్చిన కొత్త చట్టం వల్ల కరివేపాకు ఎక్కడైనా అమ్ముకునే అవకాశం వచ్చిందని వారు సంతోషంగా కేంద్ర మంత్రికి చెప్పారు. రైతుల సమస్యలు, ఇబ్బందులు పరిష్కారం కోసమే కేంద్రం చట్టం తెచ్చినట్లు నిర్మలా సీతారామన్ రైతులకు వివరించారు.