పార్లమెంట్ ప్రవాస్ యోజన లో భాగంగా జోగులంబా గద్వాల జిల్లా కేంద్రంలో పుటాన్ పల్లి సమీపంలో ఉన్న ఎస్సి గురుకుల పాఠశాల ను, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ని కేంద్ర ప్రభుత్వ భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేందర్ నాథ్ పాండే నేడు పరిశీలించారు. ముందుగా విద్యార్థులు కేంద్రమంత్రి మహేంద్ర నాథ్ పాండే కు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించే సదుపాయాలతో విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. గద్వాల మండలం పుటాన్ పల్లి సమీపంలో గల ఎస్సి బాలుర గురుకుల పాఠశాలను సందర్శించి పాఠశాల నిర్వహణ ,భోజనం తదితర అంశాలపై ఆరా తీశారు. పాఠశాలలో డైనింగ్ హాల్, లైబ్రరీ, మరుగుదొడ్లు, తదితర వాటిపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ కు అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
గద్వాల పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో డయాలసిస్, జనరల్ వార్డ్ , వివిధ విభాగాలను పరిశీలించి రోగులతో మాట్లాడారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వసతుల కల్పన పై పరిశీలన సందర్భంగా బాత్రూమ్ డోర్లు లేకపోవడం పై మహిళల ఆత్మగౌరవం కాపాడండి అని కేంద్రమంత్రి అగ్రహం వ్యక్తం చేశారు. మహిళల ఆత్మగౌరవం కాపాడలేరా అంటూ అసహనం వ్యక్తం చేశారు.
పది రోజుల్లో మరమ్మతులు చేస్తామని ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. గద్వాలకు వచ్చిన కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండే డికె బంగ్లాకు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే డికె.భరత సింహారెడ్డి ,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి డికె. స్నిగ్ద రెడ్డి ఆహ్వానించి శాలువా తో సత్కరించారు. అనంతరం తేనేటి విందులో పాల్గొన్నారు.