మానవాళిపై తుపాన్లు పగబట్టినట్లుగా కనిపిస్తోంది. ఒకటి కాగానే మరోటీ రెడీగా ఉంటున్నాయి. ఇప్పటికే తుపాన్ల ప్రభావంతో అత్యధిక వర్షాలతో ఓ వైపు అన్నదాత కుదేలవుతుండగా, మరోవైపు సామాన్య జనజీవనం అస్తవ్యస్థంగా మారుతోంది. తద్ఫలితంగా వరదలు, ముంపుప్రాంతాల్లోని ప్రజలునానా కష్టాలు పడుతున్నారు. పలువురు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.
తాజాగా నివర్ తుపాను గండం గడిచిందనుకుంటే.. దానికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది. దీని ప్రభావంతో పలు చోట్ల శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించారు.
29న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఇది క్రమంగా బలపడి డిసెంబర్ 2న తుపానుగా మారే అవకాశాలున్నాయి వెల్లడించింది. ఇది గనుక తుపానుగా మారితే దీనికి మాల్దీవులు సూచించిన బురేవిగా పేరు పెట్టనున్నారు.
దీంతోపాటు డిసెంబర్ 5న ఇంకో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖాధికారులు ప్రకటించారు. ఇది బలపడితే దీనికీ మయన్మార్ సూచించిన టకేటీగా పేరు పెట్టనున్నారు.
ఇప్పటికే వర్షాకాలం దాటినా వరుసగా వర్షాలు ఏ మాత్రం వీడకపోతుండడంతో సతమతమవుతున్న ప్రజలు తుపాన్ల రూపంలో వస్తున్న అనేక ఇబ్బందుల పాలవుతున్నారు. దీనికితోడు నివర్ గండం గడిచింది అనుకుంటుంటే బురేవి, టకేటీలు పేర్లు కూడా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్న తుపాన్లతో మరింత భయాందోళనల్లో ప్రజలు ఉన్నారు.