రష్యా, ఉక్రెయిన్ మధ్య గత కొన్ని నెలలుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్లోని డొనెట్స్క్, పోల్టావాలో సోమవారం పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. ఉక్రెయిన్ పై వైమానిక దాడుల హెచ్చరికను కూడా జారీ చేశారు. ఖార్కివ్లో పేలుళ్లు సంభవించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఉక్రెయిన్లోని చాలా ప్రాంతాలలో రష్యా వైమానిక దాడులు చేయబోతున్నట్లు హెచ్చరిక జారీ చేయడం ఆందోళన కలిగిస్తున్నది.
సోమవారం ఉదయం ఉక్రెయిన్ నగరమైన క్రివీ రిహ్పై రష్యా జరిపిన దాడిలో ఒకరు మరణించారని, మరో ముగ్గురు గాయపడ్డారని స్థానిక అధికారులను ఉటంకిస్తూ మీడియా నివేదికలు తెలిపాయి. పారిశ్రామిక యూనిట్ను మూడు క్షిపణులు ఢీకొన్నాయని సైనిక అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఓ ఉద్యోగి మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఇదిలా ఉండగా, శీతాకాలంలో అప్రమత్తంగా ఉండాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆదివారం ఒక వీడియో ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్ పై పైచేయి సాధించేందుకు రష్యా శీతాకాలాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నదని జెలెన్స్కీ చెప్పారు. ఈ శీతాకాలం ఎంత కష్టమైనా తట్టుకోవడానికి ఉక్రెయిన్ ప్రజలు అన్ని ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.