అమెరికా విధించిన ఆంక్షలు తమ దేశానికి తెచ్చిపెట్టిన కష్టాలకు తోడు కరోనా వైరస్ రావడంతో తమ ఆర్ధిక పరిస్థితి పూర్తిగా చితికిపోయిందని ఇరాన్ అధ్యక్షుడు హాస్సన్ రౌహాని తెలిపారు. ఈ ఏడాది మొత్తం తమకు ఎన్నో ఇబ్బందులు తెచ్చిపెట్టిందని ఆయన అన్నారు. ఈ దశలో ప్రజలు ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన దేశ ప్రజల్ని కోరారు.
2018లో ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించారు. ఆ నాటి నుంచి తమ ఆర్ధిక పరిస్థితి దిగజారిపోతుండగా వచ్చిన కరోనా వ్యాధి తమ దేశాన్ని అతలాకుతలం చేసిందని రౌహాని తెలిపారు. నేడు అమెరికా డాలర్ తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ అత్యంత కనిష్టానికి చేరింది. గత 24 గంటలలో 2,489 కొత్త కేసులు నమోదు కాగా దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 2,22,669 కి చేరింది. మొత్తం ఇప్పటికి 10, 508 మంది చనిపోయారు.