కృష్ణ నది జలాలను హుజుర్ నగర్ ప్రజలకు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని టిపిసిసి చీఫ్,ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ సర్వ సభ్య సమావేశంలో గురువారం నాడు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ నిధులను మున్సిపల్ ఎజెండాలో పెట్టడంపై అభ్యంతరం తెలిపారు. ఎమర్జెన్సీ పేరిట మున్సిపల్ నిధులను తీర్మానం లేకుండా జిల్లా కలెక్టర్ వినియోగించడం కౌన్సిల్ అధికారాన్ని నాశనం చెయ్యడమే అని అన్నారు.
మున్సిపాలిటీ స్వతంత్ర సంస్థ అని,కౌన్సిల్ అధ్యక్షులకు ముఖ్యమంత్రికి ఉన్న అధికారాలు ఉన్నాయని,ప్రతి నెల క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి, సమస్యలపై చర్చించాలని అన్నారు. ఖర్చుపై ఖచ్చితంగా పారదర్శకత ప్రదర్శించాలని గుర్తు చేశారు.
హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన 4వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలని,అభివృద్ధి కోసం గ్రామీణ స్థాయి నుండి ఢిల్లీ వరకు పోరాడతామని అన్నారు.
నకిలీ విత్తనాలపై సీఎం కేసిఆర్ ప్రకటనలకే పరిమితం అయ్యాయని, నిందితులపై పీడీ యాక్ట్ పెడతామన్న ప్రభుత్వం చింతలపాలెం మండలంలో రూ.కోట్ల రూపాయల నకిలీ విత్తనాల స్కామ్ లో పెద్దమనుషులపై పీడీ యాక్టు కాదుగా కనీసం పోలీస్ స్టేషన్ కు కూడా పిలవడం లేదని,నియోజకవర్గంలో బట్టబయలైన నకిలీ విత్తనాల కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చెయ్యకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని అన్నారు.