కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ యుద్ధ ప్రాతిపదికన టీకా వేయించుకుని, 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు. వనపర్తి జిల్లాలోని వ్యాక్సినేషన్ సెంటర్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వనపర్తి పట్టణంలోని పీర్ల గుట్ట వ్యాక్సినేషన్ సెంటరు, పెద్దగూడెం వ్యాక్సినేషన్ సెంటర్, సంత బజార్, కడుకుంట్ల లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వ్యాక్సినేషన్ సెంటర్, రాయల్ పేట, కొత్తకోట మున్సిపాలిటీలలో వ్యాక్సినేషన్ సెంటర్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 19 లోగా 100% వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశించారు.
గ్రామస్థాయిలో ఆశా వర్కర్, వీఆర్వో, వార్డు మెంబర్ కలిసి ఒక టీమ్ గా ఏర్పడి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకునే విధంగా అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ఇప్పటికే మన జిల్లాలో మొదటి, రెండవ డోసు లు వ్యాక్సినేషన్ చేయించుకున్నవారు 35 శాతం ఉన్నారని ఆమె తెలిపారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు సమన్వయంతో ప్రజల్లో అవగాహన కల్పించి, వారికి కావలసిన సౌకర్యాలను అందుబాటులో ఉంచి, ఈ నెల 19వ తేది లోపు 100% వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని అధికారులకు ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చందు నాయక్, ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు, వి ఆర్ వో లు, ఆశా వర్కర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్