కరోనా పరిస్థితుల నేపధ్యంలో జరుగుతున్న లాక్ డౌన్ అమలు తీరుపై స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సమీక్షించారు. లాక్ డౌన్ తో కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టాయన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంతో పాటు గ్రామాలలో కూడా లాక్ డౌన్ ను సక్రమంగా అమలు చేయాలని సూచించారు.
కరోనా కట్టడి విషయంలో ప్రజాప్రతినిధులు ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కరోనా నుంచి రక్షణ పొందవచ్చు, అందుకే ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.
బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ఈరోజు హైదరాబాద్ లోని తన అధికార నివాసం నుండి వీడియో కాల్ లైవ్ ద్వారా ఆయన సంభాషించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వానాకాలం మొదలైనందున పంటల సాగుకు సమాయత్తం కావాలని సూచించారు. వానాకాలం పంటను జూన్ నెలలో నాట్లు వేయడం ద్వారా నవంబర్ నెల తుఫాను లను తప్పించుకోవడానికి వీలవుతుందన్నారు.
ఈ దిశలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అవసరమైన విత్తనాలు, ఎరువులను అవసరమైన మేరకు ముందుగానే నిల్వ చేసుకోవాలని సూచించారు.
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంపై గ్రామాలు, పట్టణంలోని వార్డుల వారిగా స్పీకర్ వివరాలను తెలుసుకున్నారు. లబ్దిదారులకు అవసరమైన సామాగ్రిని అందజేయాలని, త్వరితంగా నిర్మాణాలు పూర్తి అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదేవిధంగా గ్రామాలలో జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా సమాచారం తెలుసుకుని తగు సూచనలను చేశారు.