మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసింది తప్పేనని వైసీపీ అగ్ర నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. వల్లభనేని వంశీ తొందరపాటు చర్యల వల్లే అరెస్టు అయ్యాడని, అందుకు పార్టీ వత్తాసు పలకాల్సిన అవసరం లేదని కూడా జగన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఫిర్యాదుదారును బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేసే విషయంలో వంశీ ఆ తర్వాత జరిగే పరిణామాలను ఏ మాత్రం అంచనా వేయకుండా తొందరపాటుతో ప్రవర్తించాడని వారు ఒక అంచనాకు వచ్చారు.
వంశీ చేసిన పనిపై వైసీపీ పెద్దలు అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అసలు అలాంటి ఆలోచన ఏ చెట్టు కిందప్లీడర్ కూడా ఇవ్వడని, వంశీకి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది.. ఎందుకు ఎగ్జిక్యూట్ చేశారన్నది వైసీపీ పెద్దలకు కూడా అంతుబట్టడం లేదు. వల్లభనేని వంశీ టీడీపీ హిట్ లిస్టులో ఉన్న విషయం తెలిసిందే. ఆ విషయం ఆయనకు కూడా బాగా తెలుసు. అలాంటప్పుడు నేరుగా ప్రభుత్వం, పోలీసులపైనే కుట్రలు చేస్తే చూస్తూ ఉరుకుంటారా? ఇంత చిన్న లాజిక్ వంశీ ఎలా మిస్సయ్యాడని వారు విస్మయానికి గురవుతున్నారు. వంశీపై ఉన్న నెగెటివిటీ, ఆయన మాట్లాడిన బూతులు, చేసిన చేష్టల కారణంగా అరెస్టు విషయంలో కనీస సానుభూతి కూడా రాలేదు. వంశీ అత్యుత్సాహంతో ఓ పెద్ద తప్పు చేశారు. అది ఆయనను ఎంత కాలం వెంటాడుతుందో చెప్పడం కష్టమని లాయర్లు కూడా చెబుతున్నారు. ఈ అరెస్టు తర్వాత కొడాలి నాని కూడా ఎవరికీ అందుబాటులో లేకుండా పోయినట్లుగా ప్రచారం జరుగుతోంది.