తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాల్మీకి బోయలను వెంటనే ఎస్టీ రిజర్వేషన్ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తాసిల్దార్ కార్యాలయాలలో నేడు వినతిపత్రం అందచేశారు. కొల్లాపూర్ తాసిల్దార్ కార్యాలయంలో వాల్మీకి సంఘం నాయకులు ఈ మేరకు వినతి పత్రం అందచేశారు.
2017 సంవత్సరంలో తెలంగాణ అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారని వారు గుర్తు చేశారు. ముస్లిం రిజర్వేషన్లతో పాటు వాల్మీకిలను ఎస్టిలో చేర్చేందుకు కేంద్రాన్ని కోరినా ఇప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదని వారన్నారు.
ముస్లిం రిజర్వేషన్లను, వాల్మీకులను ఎస్టీలలో చేర్చే అంశాలు రెండింటికి ఒకే తీర్మానంలో పంపినందున, ఈ రెండు తీర్మానాలను వేరు చేసి పంపండి అని తెలంగాణ కు కేంద్రం తిప్పి పంపిందని అయితే ఆ తీర్మానాలను తెలంగాణ ప్రభుత్వం వేరుచేసి పంపలేదని వారన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి బోయల ఎస్టీ బిల్లును వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి త్వరగా పంపాలని వారు డిమాండ్ చేశారు. వాల్మీకి తాలూకా ఉపాధ్యక్షులు ప్రసాద్ నాయుడు మాట్లాడుతూ ఎలాంటి కులవృత్తి లేని వాల్మీకి బోయలకు గత 60 సంవత్సరాల నుండి ప్రభుత్వాలు ఏమీ మేలు చేయలేదని అన్నారు.
రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులకు వాల్మీకి కులస్తుల తగిన బుద్ధి చెబుతారనిని హెచ్చరించారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర రాజకీయాలను శాసించే విధంగా ప్రతి ఒక్క వాల్మీకి ఎదగాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ నాయుడు, బిచ్చన్న నాయుడు, మేనక సత్యనారాయణ, లింగం నాయుడు, కరుణాకర్ నాయుడు, కార్పెంటర్ రమేష్, కొండల్ నాయుడు, సురేష్ నాయుడు, రాఘవేంద్ర నాయుడు, తదితర వాల్మీకి నాయకులు పాల్గొన్నారు.