షూటింగులతో సందడిగా ఉండే రామోజీ ఫిలిం సిటీలో ఇప్పుడు వనదుర్గా మూల మంత్ర పారాయణం జరుగుతున్నది. ఇదమిద్ధంగా కారణం తెలియదు కానీ అరుదుగా నిర్వహించే వనదుర్గా మూల మంత్ర పారాయణం అక్కడ నిర్వహిస్తున్నారు.
వనదుర్గా మాతకు 564 మంత్రాలు ఉంటాయి. వీటిలో 364 మంత్రాలను మూల మంత్రాలు అంటారు. ఈ మూల మంత్రాలను ప్రత్యేకంగా శిక్షణ పొందిన వేద పండితులు మాత్రమే పారాయణ చేయగలుగుతారు.
364 మూల మంత్రాలను ఒక్క సారి పారాయణ చేయడానికి సుమారుగా నాలుగు గంటల సమయం పడుతుంది. ఆదివారంనాడు ప్రారంభమైన వనదుర్గా మూల మంత్ర పారాయణం సోమ, మంగళవారాలు కూడా కొనసాగుతుంది.
సాధారణంగా అడవులలో తపస్సు చేసుకోవడానికి వెళ్లే మునులు తమకు విష సర్పాల నుంచి, విష వాయువులు, విష వృక్షాల నుంచి తమకు కీడు వాటిల్లకుండా వన దుర్గ మూల మంత్ర పారాయణం చేసి తపస్సుకు బయలు దేరుతారు.
అయితే రామోజీ ఫిలిం సిటీలో వనదుర్గ మూల మంత్ర పారాయణం ఎందుకు చేస్తున్నారో స్పష్టంగా తెలియలేదు. ముగ్గురు వ్యక్తుల సంపూర్ణ ఆరోగ్యం కోసం, వారికి ఎలాంటి దోషాలు ఉన్నా తొలగడం కోసం ఈ పారాయణ మొదలు పెట్టినట్లు తెలిసింది.
విష పురుగుల పీడ నుంచి ముగ్గురు వ్యక్తులకు కీడు సోకకుండా ఈ పారాయణం ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో గాన గంధర్వుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పాల్గొని కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంతో బాటు పలువురు గాయనీగాయకులకు కూడా కరోనా సోకింది. అదృష్ట వశాత్తూ వారంతా కోలుకోగా ఎస్ పి బి మృత్యువుతో పోరాడలేక నేలకొరిగారు.
శివ మంత్రం తీసుకున్న ఎస్ పి బి తమ ప్రాంగణంలోకి వచ్చి మృత్యువు బారిన పడటం వల్ల ఈ పారాయణం మొదలు పెట్టారేమో స్పష్టంగా తెలియదు.