పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా టిఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి కి మద్దతుగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ దామోదర రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
చావునోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేవలం ఆరు సంవత్సరాలలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శిస్తే టిఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకోరని ఆయన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని హెచ్చరించారు.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కంటే బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఒక్క రూపాయి జీతం ఎక్కువ ఇచ్చిన నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా….మీరు సిద్ధమా..? అని ఆయన సవాల్ చేశారు.
పూర్వ భారత ప్రధాని పి.వి కుమార్తె పాలమూరు గడ్డ కోడలు వాణీదేవి మన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి బరిలో నిలిపారని, పాలమూరు కోడల్ని గెలిపించుకోవాల్సిన బాద్యత మనందరిదని ఆయన అన్నారు.