లోక కల్యాణార్థం టిటిడి నిర్వహిస్తున్న జ్యేష్ఠ మాస పూజా కార్యక్రమాల్లో భాగంగా గురువారం తిరుపతి శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో శ్రీ వట సావిత్రి వ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. వర్సిటీలోని శ్రీ మహావిష్ణువు యాగశాలలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
పురాణాల ప్రకారం మర్రిచెట్టు నీడలో త్రిమూర్తులతో పాటు అధిదేవతగా పూజలందుకునే సావిత్రిదేవిని ఆరాధిస్తే సకల శుభాలు చేకురుతాయి. ముందుగా మర్రి చెట్టు నీడలో కొలువు దీరిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు సావిత్రిదేవి చిత్రపటాన్ని ప్రతిష్టించారు.
అనంతరం వర్సిటీ ఆచార్యులు శ్రీ ఫణిరాజశాస్త్రి వటసావిత్రి వ్రత ప్రాశస్త్యాన్ని వివరించారు. సావిత్రి అల్పాయుష్షు ఉన్న తన భర్తను బతికించుకోవడానికి వటసావిత్రి వ్రతం ఆచరించి, యమధర్మ రాజును ప్రార్థిచిందన్నారు. యమ ధర్మరాజు వర ప్రభావంతో సావిత్రి తన భర్తను బతికించుకున్నట్లు వివరించారు.
ఆ తరువాత వర్సిటీ డీన్ ఆచార్య శ్రీ గోలి వెంకటసుబ్రహ్మణ్యశర్మ ఆధ్వర్యంలో సంకల్పం, గణపతిపూజ, ప్రార్థన, వటసావిత్రి వ్రతం నిర్వహించారు. సింధూరం, చందనం, పుష్పాలతో సావిత్రి అష్టోత్తరశతనామావళి పఠించారు. పలు నివేదనలు, నీరాజనాలు అందించిన అనంతరం క్షమాప్రార్థనతో ఈ పూజ ముగిసింది. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు దేవీ సంకీర్తనలు ఆలపించారు.
ఈ పూజా కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీ సన్నిధానం సుదర్శన శర్మ, విశ్వవిద్యాలయం ఆచార్యులు పాల్గొన్నారు.