ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై టిటిడి నిర్వహిస్తున్న పారాయణం ఆధ్యాత్మిక కార్యక్రమం వంద రోజులు పూర్తి చేసుకుంది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లోని భక్తులు పెద్దసంఖ్యలో అనుసరించి తమ ఇళ్లలో పారాయణం చేస్తున్నారు.
విశ్వవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల నుండి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. మొదటగా “యోగవాశిస్టం – శ్రీ ధన్వంతరి మహామంత్రం” పారాయణాన్ని ఏప్రిల్ 10 నుండి జూన్ 10వ తేదీ వరకు 62 రోజుల పాటు నిర్వహించారు. ఆ తరువాత జూన్ 11వ తేదీ నుండి సుందరకాండ పారాయణం ప్రారంభమైంది.
ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని ఆధ్వర్యంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు ఈ పారాయణం జరుగుతోంది.