ప్రముఖ కృష్ణయజుర్వేద ఘనాపాఠి, ఉభయవేదాంత పండితులు, వేదశాస్త్ర పారంగతులు, సంస్కృత సాహిత్య విద్వణ్మణ్యులు, సలక్షణంగా ఎంతోమందికి వేదవిద్యను అనుగ్రహించిన శ్రీమాన్ కొడిచెర్ల పాండురంగాచార్య స్వామివారు నేడు సాయంత్రం హైదరాబాదులో పరమపదించారు.
వారి వయస్సు 101 సంవత్సరాలు. మహబూబ్ నగర్ కు చెందిన వీరు సుమారు 20 సంవత్సరాల పాటు మైసూర్ కు చెందిన పరకాల మఠ 33వ జీయర్ స్వామి శ్రీ అభినవ రంగనాథ బ్రహ్మతంత్ర స్వతంత్ర జీయర్ స్వామి శ్రీచరణముల లో వేద,శాస్త్ర అధ్యయనం చేశారు.
వేములవాడలో చాలా కాలం సంస్కృత, వేద ఉపన్యాసకులుగా పనిచేశారు. అనేక బిరుదులు సత్కారాలు పొందారు. చివరిక్షణం వరకు వేదమే శ్వాసగా జీవించారు. తెలంగాణ అవతరణోత్సవం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ వీరిని వేదవిద్వన్మణి బిరుదుతో ఘనంగా సత్కరించారు.
తెలంగాణ విద్వత్సభ ద్వితీయ రాష్ట్ర జ్యోతిష మహాసభల్లో రవీంద్రభారతిలో ఈ వేదవిద్వన్మూర్తిని సమున్నతంగా సత్కరించింది. తెలంగాణ రాష్ట్ర వేదం శాస్త్ర ప్రవర్ధక సభ ఆవిర్భావ దినోత్సవం రోజున టీటీడీ బాలాజీ భవన్ లో ఘనంగా సత్కారం జరిగింది.
వేద పండితులు కొడిచెర్ల పాండురంగాచార్య స్వామి మరణం పట్ల సీఎం కేసిఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దర్శనమ్ శర్మ స్వామి పరమపదించడం పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.