వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి మహా శివరాత్రి జాతర మహోత్సవాలకు రావాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి దేవస్థాన ఈవో కృష్ణవేణి ఆహ్వాన పత్రికను అందించారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. వేదపండితులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆశీర్వదించి, ప్రసాదాలను అందజేశారు.
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి జాతరకు వచ్చే లక్షలాది భక్తుల సౌకర్యార్థం వేములవాడలో చేపట్టిన మహోత్సవ జాతర ఏర్పాట్లను ఈవో మంత్రికి వివరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లను ఏర్పాటు చేయాలని, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని ఈ సందర్భగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈవోను ఆదేశించారు. ఫిబ్రవరి 20-22 వరకు శివ రాత్రి మహోత్సవాలు జరుగుతాయని ఈవో వెల్లడించారు.