తుంగభద్రా నది పుష్కరాలు ప్రారంభం కావడంతో జోగులాంబ గద్వాల జిల్లా లోని ఐజ మండలం వేణి సోంపురం పుష్కర ఘాట్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రశాంతతకు నెలవైన పుష్కర ఘాట్లు తుంగభద్రా నది హోయలు పలుకుతూ ముందుకు సాగిపోతున్నది. గలగల పారే సెలయేరులా భక్తులను అలరిస్తూనే పుష్కర స్నానానికి అనువుగా ఉండటంతో ఈ పుష్కర ఘాట్ కు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అంతేకాక వ్యాస తత్వజ్ఞ తీర్థులు ద్వారా ప్రతిష్ఠితమైన వేణుగోపాలస్వామి ఆలయం ఉండటం మరింత శోభాయమానంగా మారింది. ఇక్కడకు వచ్చే భక్తులకు అన్నిసదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
రూట్ మ్యాప్
హైదరాబాదుకు 245 కిలోమీటర్ల దూరంలో గల వేణిసోంపురం పుష్కర ఘాట్ వచ్చే భక్తులు గద్వాల చేరుకుని అయిజ నుండి వేణి సోంపురం పుష్కర ఘాట్ వరకు చేరుకోవచ్చు. దేవాదాయ శాఖ తరపున మల్దకల్ శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం కార్య నిర్వాహణాధికారి సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.