సీనియర్ పాత్రికేయుడు ఏపీయూడబ్ల్యూజే మాజీ అధ్యక్షులు పిల్లలమర్రి విజయ వేణుగోపాల స్వామి (86) మరణం పట్ల భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు.
సోమవారం అమెరికాలోని ఏకైక కుమారుడు శ్యామ్ ప్రసాద్ గృహంలో వేణుగోపాల స్వామి కన్ను మూశారు. వీరు కొంతకాలంగా అస్వస్థతతో ఉన్నారు.
తెనాలికి చెందిన గోపాల స్వామి తొలుత ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు విలేకరిగా పత్రికా రంగం లోకి ప్రవేశించి దాదాపు మూడు దశాబ్దాలకు పైగా పని చేశారు.
ఇదే సమయంలో పి.టి.ఐ వార్తాసంస్థకు ప్రతినిధిగా పనిచేశారు. 1978-80, 1981-82 మధ్యకాలంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడిగా రెండు మార్లు పని చేశారు.
1992లో జర్నలిజం వృత్తి నుంచి రిటైర్ అయ్యారు. పాత్రికేయుడిగా నిరంతరం ప్రజా సమస్యలను గోపాల స్వామి ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లేవారని వెంకయ్య అన్నారు.
జర్నలిజం వృత్తిలో ఉంటూనే తెనాలిలో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను పోత్సహించడం తనకు గుర్తుందని ఆయన అన్నారు.