వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి మంగళవారం నాటితో మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ మూడేళ్ల ప్రయాణంలో ఎదురైన ప్రధానఘట్టాలను క్రోడీకరించి ‘కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, ఛేంజింగ్’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ విడుదల చేశారు.
ఈ పుస్తకం డిజిటల్ వెర్షన్ను కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి ప్రకాశ్జావడేకర్ ఆవిష్కరించారు. 250 పేజీల ఈ పుస్తకాన్ని కేంద్ర సమాచార, ప్రసారశాఖకు చెందిన ప్రచురణల విభాగం రూపొందించింది. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు చేసిన ప్రసంగాలు, ప్రయాణాలు, ఇతర ముఖ్యకార్యక్రమాలన్నింటికీ ఇందులో స్థానం కల్పించారు.
రాజ్యసభ ఛైర్మన్గా ఆయన చేపట్టిన సంస్కరణలతోపాటు, ఎగువ సభ కార్యకలాపాల ఉత్పాదకతను ఎలా పెంచిందీ ఇందులో వివరించారు. ప్రస్తుత కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్ సమయంలో మిషన్ కనెక్ట్ పేరుతో ఆయన పాత స్నేహితులు, ఉపాధ్యాయులు, సుదీర్ఘ సహచరులు, బంధువులు, ఆధ్యాత్మిక గురువులు, పాత్రికేయులతో మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్న విషయాన్నీ ఈ పుస్తకంలో పొందుపరిచారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తదితరులు వెంకయ్యకు అభినందనలు తెలిపారు. పుస్తకావిష్కరణ అనంతరం రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ…ఉపరాష్ట్రపతి పదవికే వెంకయ్యనాయుడు వన్నెతెచ్చారని అభినందించారు. కీలక సందర్భాల్లో ఆయన వ్యవహరించిన తీరు స్ఫూర్తిదాయకమన్నారు.
వెంకయ్య నాయుడు మాటల్లోనూ కళాత్మకత ఉంటుందన్నారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ… ఉప రాష్ట్రపతిగా మూడేళ్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలను కాపాడాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.