పరమ పవిత్ర ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ వేణుగోపాల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహన పూజ కన్నుల పండుగ జరిగింది.
రైతు మహిళా భక్త బృందంచే నూతనంగా తయారు చేయించిన కల్పవృక్ష వాహనానికి అర్చకులు మంత్రోచ్ఛారణతో సంప్రోక్షణ గావించారు. ముందుగా విశ్వక్సేనారాధన,వాసుదేవ పుణ్యాహవాచనం,వాస్తు హోమం, పూర్ణాహుతి జరిపారు.అనంతరం పసుపు, కుంకుమ,గంధంతో కల్పవృక్ష వాహనాన్ని అందంగా అలంకరించారు.తులసి, పూలమాలలతో అందంగా అలంకరించారు.
ప్రాతః కాలంలో భక్తుల గోత్ర నామాలతో అర్చకులు పూజ జరిపి శ్రీ విష్ణు సహస్రం,గోదాదేవి,రామానుజ అష్టోత్తర శతనామావళి పూజ చేశారు. మహిళా భక్తులు తిరుప్పావైని శ్రావ్యంగా గానం చేశారు.సాయంత్రం ఉభయ దేవేరులైన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిని కల్పవృక్ష వాహనంపై అధిష్టింపజేసి గుడి సేవ గావించారు.భక్తులు గోవింద నామాలు,జై శ్రీమన్నారాయణ జయ జయ ద్వానాల నడుమ వాహన సేవ వైభవంగా సాగింది.
ఆలయ కార్యనిర్వాహణాధికారి గుజ్జుల కొండారెడ్డి వాహన దాతలను పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు,స్థానా చార్యులు,రైతు మహిళా భక్తులు,వికాస తరంగిణి కార్యకర్తలు, దేవాలయ అభివృద్ధి సమితి సభ్యులు,పుర ప్రముఖులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్