హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న యూసఫ్ గూడా లోని దుర్గామాత దేవాలయం కమాన్ ను అక్రమంగా కూల్చివేయడాన్ని నిరసించిన భజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్టు చేయడం అన్యాయమని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. తెలంగాణ రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పాలన సాగుతోంది అనడానికి ఇది నిదర్శనమని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్ అన్నారు.
శనివారం మధ్యాహ్నం కేవలం ముగ్గురు భజరంగ్ దళ్ కార్యకర్తలు మాత్రమే నిరసన తెలుపుతున్నా కూడా 24 మంది ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు, భారీ సంఖ్యలో పోలీసులు వచ్చి వారిపై దౌర్జన్యం చేశారని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. ఉగ్రవాదులను అరెస్టు చేసిన దానికంటే ఘోరంగా ప్రవర్తిస్తూ బజరంగ్ దళ్ కార్యకర్తలను లాక్కెళ్లడం దారుణమని విశ్వహిందూ పరిషత్ వ్యాఖ్యానించింది.
భజరంగ్ దళ్ కార్యకర్తలపై దాడికి పాల్పడి చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. లేదంటే పోలీసుల చర్యలకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బండారి రమేష్ హెచ్చరించారు. ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని విశ్వహిందూ పరిషత్ ప్రచార సహ ప్రముఖ్ పి బాలస్వామి, రాష్ట్ర కార్యాధ్యక్షడు సురేందర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు తెలిపారు.