పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమల తిరుపతి వెళ్లే అలిపిరి టోల్గేట్ వద్ద బుధవారం భద్రతా సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో ఒక వ్యక్తి కారులో నిషేధిత పదార్థాలైన మద్యం, మాంసం దొరికాయి. కోవిడ్-19 నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడం, నిషేధిత పదార్థాలను తిరుమలకు తీసుకెళుతుండడంతో నిందితుడిని పోలీసులకు అప్పగించామని టిటిడి విఎస్వో ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.
తిరుపతికి చెందిన ఎన్.వెంకటముని కారులో తిరుపతి నుండి తిరుమలకు వెళుతుండగా అలిపిరి టోల్గేట్ వద్ద భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. ముందు సీటు కింది భాగంలో నిషేధిత పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 5 కిలోల చికెన్, సిగ్నేచర్ విస్కీ – 4 బాటిళ్లు, ఓట్కా – 2 బాటిళ్లు, లూజ్ లిక్కర్ – 2000 ఎంఎల్ ఉన్నాయి. నిందితుడిని తిరుమలలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
కాగా వెంకటమునిపై గతంలో నమోదైన ఒక కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. తనిఖీ సందర్భంగా సదరు వ్యక్తి వద్ద వీడియో జర్నలిస్టు పేరిట ఉన్న గుర్తింపు కార్డును గుర్తించామని టిటిడి విఎస్వో ప్రభాకర్ తెలిపారు.
వెంకటముని ప్రస్తుతం మహాన్యూస్ ఛానెల్ లో పని చేస్తున్నాడు. అంతకు ముందు ఏబిఎన్ ఛానెల్ లో పని చేసే సమయంలో తిరుమల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బ్లాక్ చేసి ఇతను పట్టుపడ్డట్టు కూడా కేసు ఉంది.