విజయనగరం జిల్లాలో 46,099 మందికి “జగనన్న విద్యాదీవెన” పథకం ద్వారా…
పేద విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా ఆర్థిక సాయం అందించేందుకు జగన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులు లభ్దిపొందుతున్నారు.ఈ మేరకు విజయనగరం జిల్లాలో 46,099 మంది లబ్ధి పొందారు. జిల్లాలోని వివిధ కళాశాలల్లో వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 27,85,91,442 నిధులు జమయ్యాయి. వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఆర్థిక ప్రయోజనం పొందారు.
2022 అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన నిధుల విడుదల కార్యక్రమాన్ని సీఎం జగన్… ఎన్.టి.ఆర్. జిల్లా తిరువూరు నుంచి ఆదివారం ప్రారంభించారు. జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా అర్హులైన ఆయా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో మీట నొక్కి నిధులను జమ చేశారు.
సీఎం జగన్ అనంతరం 27.85 కోట్ల విలువ గల మెగా చెక్కును కలెక్టర్ ఎ. సూర్యకుమారి, డీఆర్వో ఎం. గణపతిరావు, సాంఘిక సంక్షేమ డీడీ రత్నం, ట్రైబెల్ వెల్ఫేర్ డీడీ చంద్రశేఖర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ యశోధనరావు, మైనారిటీ వెల్ఫేర్ అధికారి లావణ్య ఇతర అధికారులు విజయనగరం జిల్లాకు చెందిన లబ్ధిదారులకు అందజేశారు.
ఎవరెవరికి.. ఎంతెంత ఆర్థిక సాయం
జగనన్న విద్యాదీవెన పథకం కింద జిల్లా నుంచి 46,099 మంది లబ్ధిపొందారని, 27.85 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వర్గానికి చెందిన 37,491 మంది విద్యార్థులకు 21.38 కోట్లు, సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 4,103 మందికి 3.49 కోట్లు, ఈబీసీ వర్గానికి చెందిన 2,590 మందికి 1.85 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 658 మందికి 27.52 లక్షలు, కాపు సంక్షేమం పరిధిలో 946 మందికి 67.89 లక్షలు, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీకి చెందిన 311 మందికి గాను 17.68 లక్షలు లబ్ధి చేకూరిందని వివరించారు.
ఈ పథకం ద్వారా అందిన ఆర్థిక సాయంతో అందరూ మంచిగా చదువుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి కలెక్టర్తో పాటు, డీఆర్వో, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ, గిరిజన సంక్షేమ శాఖ డీడీ, బీసీ వెల్ఫేర్ అధికారి, మైనారిటీ వెల్ఫేర్ అధికారి, ఇతర అధికారులు, విద్యార్థులు వారి తల్లులు పాల్గొన్నారు.