టోక్యోలో నేటి నుంచి ప్రారంభమవుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ తరపున వివిధ ఈవెంట్లలో పాల్గొంటున్న క్రీడాకారులకు విజయనగరం జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారులంతా తాము పాల్గొంటున్న క్రీడలు, అథ్లెటిక్స్ తదితర అంశాల్లో విజయం సాధించి దేశానికి పతకాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
నేటి నుంచి ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో భారత ఒలింపిక్ సంఘం జిల్లా కలెక్టర్కు బహూకరించిన జెర్సీని ధరించి తన క్యాంపు కార్యాలయంలో చీర్ అప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశానికి పెద్ద ఎత్తున పతకాలు సాధించడం ద్వార 135 కోట్ల భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరారు.
18 క్రీడాంశాల్లో 127 మంది ఈ ఒలింపిక్స్లో భారత్ తరపున వివిధ క్రీడాంశాల్లో పాల్గొంటున్నారని, ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరపున ఇదే పెద్ద బృందమని చెప్పారు. ఒలింపిక్ సంఘం తరపున సెట్విజ్ సి.ఇ.ఓ. విజయకుమార్, జిల్లా క్రీడల అధికారి వెంకటేశ్వరరావు భారత క్రీడాకారుల జెర్సీని జిల్లా కలెక్టర్కు బహూకరించారు.
ఈ సందర్భంగా నగరంలోని విజ్జీ స్టేడియంలో శని, ఆదివారాల్లో జరగనున్న రెవిన్యూ అధికారుల క్రికెట్ మ్యాచ్లపై జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, ఆర్డీఓ భవానీశంకర్ తదితరులతో చర్చించారు.
పార్వతీపురం, విజయనగరం, కలెక్టరేట్ ల నుంచి మూడు జట్లుగా ఏర్పడి రెండు రోజులపాటు స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్లు ఆడనున్నారు. జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్, జాయింట్ కలెక్టర్లు, రెవిన్యూ డివిజనల్ అధికారులు ఈ మ్యాచ్లలో ఆయా జట్ల తరపున పాల్గొంటున్నారు.