విజయనగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ముచ్చు నాగలక్ష్మీ మృతి చెందారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడిన తొలి డిప్యూటీ మేయరు ముచ్చు నాగలక్ష్మిని కరోనా కబళించింది. గత కొంతకాలంగా జ్వరం సోకి కరోనా అని నిర్దారణ అయి హాస్పటల్ లో చేరి చికిత్స పొందుతున్న డిప్యూటీ మేయర్ అకస్మాత్తు మరణం ఓ రకంగా అధికార పార్టీకి తీరని లోటు.
అందునా విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామికి మరీనూ. పురపాలక సంఘంగా ఉన్న విజయనగరం నగర పాలక సంస్థగా ఎదగడంతోగత నెలలో ఎన్నికలు జరిగాయి.దీంతో మేయర్ గా వెంపడాపు విజయలక్ష్మి,డిప్యూటీ మేయర్ గా ముచ్చు నాగలక్ష్మిలు ఎన్నికయ్యారు.
డిప్యూటీ మేయర్ గా ముచ్చు నాగలక్ష్మి బాధ్యతలు చేపట్టి నెల రోజులు అయ్యిందో లేదో మృత్యువు ఆమెను తీసుకెళ్లిపోయింది. గత కొంత కాలంగా నగరంలోన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్నారు. గత రాత్రే ఆమె కన్నుమూసారు.
డిప్యూటీ మేయర్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు పూర్తి కాక మునుపే మృతి చెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక 1 వ డివిజన్ అయిన కొత్తపేట విజయలక్ష్మి నగర్ లో డిప్యూటీ మేయర్ ముచ్చు నాగలక్ష్మి నివాసం.
ఈ ప్రాంతంలో ఇప్పటికే ఆ ప్రాంతం మొత్తం కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఎన్నికలు, ఆపై ఫలితాలు, విజయోత్సవ కార్యక్రమాలు వల్ల విజయనగరంలో ఎమ్మెల్యే తో పాటు పలువురు కార్పొరేటర్లు కోవిడ్ బారిన పడ్డారు.
ఈ క్రమంలో రెండో వార్డు కార్పొరేటర్ రాజేష్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆయన ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అదే విధంగా 14వ డివిజన్ కార్పొరేటర్ కూడా కోవిడ్ బారిన పడి సీరియస్ కండీషన్లో ఉన్నారు. కార్పొరేషన్ కమిషనర్, పీఆరోఓ చౌదరి, ఆయన భార్య కరోనా బారిన పడి కోలుకున్నారు. కార్పొరేషన్ మొత్తంగా కరోనా విస్తృతంగానే వ్యాపించిందనే చెప్పాలి.