గతంలో పని చేసిన అనుభవంతో దిశ యాప్ పై దృష్టి…!
దిశ డీఐజీ ఆదేశాలతో మరింత త్వరితగతిన కేసులపై దర్యాప్తు
దిశ స్పూర్తితో కేసుల దర్యాప్తు వేగవంతం.
ఎస్ఓఎస్ యాప్ పట్ల మహిళలకు అవగాహన.
దిశ పీఎస్ లో 145 కేసులు నమోదు.
7 రోజుల్లో 88 కేసుల దర్యాప్తు పూర్తి.
10 రోజుల్లో మరో 21 కేసులు,.
15 రోజుల్లో మరో 16 కేసులు.
20 రోజుల్లో మరో 5 కేసులు.
30 రోజుల్లో మరో 5 కేసుల దర్యాప్తు పూర్తి.
ఇదీ విజయనగరం జిల్లాలో దిశ యాప్ పట్ల అలాగే దిశ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల దర్యాప్తు జరిగిన తీరు..గతంలో అదే దిశ విభాగానికి పోలీస్ ఉన్నతాధికారిణిగా పని చేసిన దీపికా ఎం పాటిల్…రెండు నెలల క్రితం జిల్లాకు ఎస్పీగా పదవీ బాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని దిశ యాప్,దిశ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల విచారణను వేగవంతం చేసందుకు సమీక్షలు జరుపుతునే ఉన్నారు.
తాజాగా రాష్ట్రంలో గుంటూరు కు చెందిన రమ్య ఉదంతం వెలుగులోకి రావడంతో దిశ యాప్ పై సీఎం ఆదేశాలతో డీజీపీ మరింత దృష్టి సారించారు. మరో వైపు రాష్ట్ర హోం మంత్రి సుచరిత కూడా దిశ విభాగంపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించడంతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలను అలెర్ట్ గా ఉండమని మౌఖిక ఆదేశాలతో పాటు శాఖా పరంగా జరుగుతున్న సెట్ కాన్ఫరెన్స్ లో కూడ ఎస్పీలకు అదేశాలు జారీ చేస్తున్నారు.
ఇందులో బాగంగా జిల్లా ఎస్పీ దీపికాఎం పాటిల్ దిశా స్ఫూర్తితో విజయనగరం జిల్లాలో కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి, సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో నిందితులపై కోర్టుల్లో అభియోగ పత్రాలను దాఖలు చేస్తున్నామని తెలిపారు. పొరుగు రాష్ట్రంలో దిశా సంఘటన జరిగినప్పటికీ, అటువంటి దురదృష్ట సంఘటన ఏపీలో పునరావృతం కాకుండా ఉండాలనే లక్ష్యంతో సీఎం జగన్ ఆదేశాలతో మహిళలపై జరిగే దాడులను తీవ్రంగా పరిగణించి, సత్వర చర్యలు చేపడుతున్నామన్నారు.
ఆపద సమయంలో మహిళలు పోలీసుల సహాయాన్ని సులువుగా పొందే విధంగా వారికి దిశా (ఎఓఎస్) యాప్ పట్ల, డయల్ 100 పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతీ రోజు జిల్లా వ్యాప్తంగా మహిళా కానిస్టేబుళ్ళు, మహిళా పోలీసుల సహకారంతో ఎక్కువగా మహిళలు, విద్యార్థినులు గుమిగూడి ఉండే ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. ఆపద సమయంలో మహిళలు దిశా (ఎస్ఓఎస్)ను ఏవిధంగా వినియోగించాలి, పోలీసు సహాయాన్ని ఏవిధంగా పొందాలన్న విషయంపై సంపూర్ణ అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
స్మార్ట్ ఫోన్లు లేని మహిళలు తమ సాధారణ ఫోనుల్లో స్పీడ్ డయల్స్ లో డయల్ 100ను నిక్షిప్తం చేస్తున్నామన్నారు. మహిళలు ఆపద సమయంలో డయల్ 100కు ఫోను చేసి, సమాచారం అందించినా, వారిని రక్షించేందుకు పోలీసుశాఖ చర్యలు చేపడుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.
మహిళలపై దాడులు జరిగిన సంఘటనలపై బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు కేసుల దర్యాప్తును వేగవంతం చేస్తున్నామన్నారు. ఈ నేపధ్యంలో దిశ పోలీస్ స్టేషన్ లో కేవలం రెండు కేసులో మాత్రమే దర్యాప్తును ఒక నెల రోజులు కంటే ఎక్కువ సమయం పట్టిందని, ఇందులో కూడా ఒక కేసులో ఫోరెన్సిక్ నివేదిక ఆలస్యం కావడం, మరో కేసులో నిందితులు పరారీలో ఉన్న కారణంగా మాత్రమే దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయలేక పోయామని జిల్లా ఎస్పీ స్పష్టం చేసారు.
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 4లక్షల మందికి పైగా దిశా యాపను తమ మొబైల్స్ లో డౌన్లోడు చేసుకున్నారన్నారు. అదే విధంగా గడచిన రెండు నె లలో దిశా (ఎస్ ఓ ఎస్)కు 4156 కాల్స్ రాగా, వాటిలో ఎస్ ఓఎస్ పని తీరును పరిశీలించేందుకు చేసిన 4073గా గుర్తించామన్నారు. మరో 71 ఎస్ ఓ ఎస్ ఫిర్యాదుల పై పోలీసుశాఖ తక్షణమే స్పందించి, సమయానుకూలంగా చర్యలు చేపట్టిందని, మరో 12 ఫిర్యాదులపై ఎస్ఎఆర్ లను నమోదు చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు.
దిశ అన్నది మహిళల రక్షణకు చర్యలు తీసుకొనే ఒక చట్టం మాత్రమే కాదని, వారి రక్షణకు తీసుకొనే అన్ని చర్యలను కూడా దిశ పేరుతోనే చేపడుతున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. కావున, ప్రజలెవ్వరూ మహిళల రక్షణపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని, ఆపద సమయంలో దిశా (ఎస్ ఓ ఎస్) లేదా డయల్ 100 కు సమాచారం అందించి పోలీసుల సహాయం పొందాల్సిందిగా ప్రజలకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక విజ్ఞప్తి చేసారు.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్