తరచూ మావోయిస్టులు తిరిగాడే ఏరియాలో విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి పర్యటిస్తున్నారు. తాజాగా జిల్లాలో మక్కువ మండలం దుగ్గేరు, ఎర్రసామంతవలస, దిగువ మండంగి, బాహుజ్వాల, పనసభద్ర గ్రామాలను జిల్లా ఎస్పీ రాజకుమారి సందర్శించి, గిరిజనులతో మమేకమయ్యారు.
గిరిజన యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు మెగా వాలీబాల్ టోర్నమెంటును ఎర్రసామంతవలసలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అదే విధంగా వృద్ధులు, గిరిజనులకు వైద్య సహాయాన్ని అందించేందుకు మెగా వైద్య శిబిరాన్ని దుగ్గేరులో నిర్వహించి, గిరిజనులకు దుప్పట్లు, నగదు, చెప్పులు అందించారు.
విజయనగరం నగరం పుణ్యగిరి కంటి ఆసుపత్రి వైద్యులు కూడా ఈ వైద్య శిబిరంలో పాల్గొని, గిరిజనులకు కంటి పరీక్షలు నిర్వహించగా, ఇద్దరు నిపుణులైన వైద్యులు, వైద్య సిబ్బంది గిరిజనులకు వైద్య సహాయాన్ని అందించి, ఉచితంగా మందులను పంపిణీ చేసారు.
మక్కువ మండలం ఎర్రసామంతవలస లో నిర్వహించిన మెగా వాలీబాల్ టోర్నమెంటును విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ – గిరిజన పల్లెల్లోని పిల్లలు, యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంటును నిర్వహిస్తున్నామన్నారు.
గిరిజన యువతలోని క్రీడా ప్రతిభను పోలీసుశాఖ ప్రోత్సహించేందుకు, యువతకు అవకాశాలు కల్పించేందుకు ఇతర శాఖలతో సమన్వయం సాధిస్తున్నదన్నారు. దేశానికి సేవ చేసేందుకు యువత ముందుకు రావాలని, సక్రమమైన మార్గంలో నడవాలని, తద్వారా తమ కుటుంబాలను ఆర్ధికంగా బలోపేతం చేసుకుంటూ, దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలన్నారు.
దేశ ప్రగతి, సౌభాతృత్వం యువత చేతుల్లోనే ఉందన్నారు. భారత స్వతంత్ర్య సంగ్రామంలో ఎంతోమంది నాయకులు యువకులుగా ఉన్న సమయంలోనే భాగస్వామ్యులై, దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించారన్నారు. యువశక్తితో సాధించలేనిదంటూ ఏమీ లేదన్నారు.
మెగా వైద్య శిబిరం ప్రారంభం
అనంతరం, దుగ్గేరు గ్రామంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరంను జిల్లా ఎస్పీ ప్రారంభించి, గిరిజనులతో మమేకమయ్యారు. గిరిజనులకు గొడుగులు, నగదు, చెప్పులు, దుప్పట్లు, చీరలు అందించారు. వైద్య బృందం సహకారం తో వైద్య సేవలందించి, ఉచితంగా మందులను పంపిణీ చేసారు.
విజయనగరం లోని పుణ్యగిరి కంటి ఆసుపత్రి వైద్యులు గిరిజనులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం, గిరి శిఖర గ్రామాలైన బాహుజ్వాల, దిగువ మండంగి గ్రామాలను జిల్లా ఎస్పీ బి. రాజకుమారి, ఒఎస్ డి ఎన్. సూర్యచంద్రరావు మరియు ఇతర పోలీసు అధికారులు సందర్శించి, అక్కడ గిరిజనులతో మమేకమై, గిరిజనుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
గిరి శిఖర గ్రామాల్లోని వృద్ధులు, పిల్లలకు జిల్లా ఎస్పీ పండ్లు, నగదును అందజేసారు. ఈ కార్యక్రమంలో ఒఎడి ఎన్. సూర్యచంద్రరావు, పార్వతీపురం డీఎస్పీ ఎ. సుభాష్, ఏఆర్ డీఎస్పీ ఎల్. శేషాద్రి, సాలూరు సీఐ సింహాద్రి నాయుడు, మక్కువ ఎస్ఐ రాజేష్, పాచి పెంట ఎస్ఐ రమణ, సాలూరు రూరల్ ఎస్ఐ దినకర్ మరియు ఇతర పోలీసు అధికారులు, స్పెషల్ పార్టీ పోలీసులు, గిరిజన యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భరత్, సత్యం న్యూస్ విజయనగరం