హైదరాబాద్ లోని ప్రగతిభవన్లో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరిగింది. ఈ ఇద్దరి భేటీలో చర్చకు వచ్చిన అంశాలు ఏమిటో గానీ సోషల్ మీడియాలో మాత్రం ఒక అంశం వైరల్ అయి కూర్చున్నది. ప్రగతిభవన్కు వచ్చిన ఏపి సిఎం జగన్కు తెలంగాణ సిఎం కేసీఆర్, ఆయన కుమారుడు, తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ ఎదురు వెళ్ల ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు ఇవ్వడం శాలువలు కప్పడం లాంటి లాంఛనాలు పూర్తి అయిన తర్వాత ప్రగతిభవన్లో ఆసక్తికర సన్నివేశం జరిగింది.
జగన్తో పాటుగా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ప్రగతిభవన్కు వచ్చారు. జగన్తో మాట్లాడుతున్న సమయంలో విజయసాయిని గమనించిన కేసీఆర్, ఆయన్ను పలకరించేందుకు ఆగారు. ఇది గమనించిన విజయసాయి రెడ్డి అమాంతం వంగి కేసీఆర్కు పాదాభివందనం చేశారు. ఇది కెమెరాలలో చిక్కింది. మరింకేం సోషల్ మీడియాలోకి వచ్చేసింది. మరీ ఇంతగా కేసీఆర్ కు సాగిలపడాలా అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరైతే విజయసాయి రెడ్డికి పెద్దలంటే ఎంత గౌరవం అంటూ మురిసిపోతున్నారు.