స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ్యులు విజయసాయిరెడ్డి ఉక్కు పరిరక్షణ పోరాట పాదయాత్ర చేపట్టారు. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మొదటి అడుగు వేశారు.
మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన వెంట కదిలారు. ఉదయం జీవీఎంసీ మహాత్మా గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. ఆశీల్ మెట్ట జంక్షన్, సంగం శరత్, కాళీ టెంపుల్, తాటిచెట్ల పాలెం, ఊర్వశి జంక్షన్, 104 ఏరియా, మర్రిపాలెం, ఎన్ఏడీ జంక్షన్, ఎయిర్ పోర్ట్, షీలానగర్, బీహెచ్పీవీ, పాత గాజువాక, శ్రీనగర్ మీదుగా కూర్మన్నపాలెం జంక్షన్ స్టీల్ ప్లాంట్ ప్రధాన ఆర్చ్ వరకు ఐదు నియోజకవర్గాల మీదుగా దాదాపు 25 కి.మీ మేర పాదయాత్ర సాగనుంది.
సాయంత్రం 4.30 గంటలకు స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద భారీ బహిరంగ సభతో పాదయాత్ర ముగియనుంది.
యావత్ తెలుగు జాతికి గర్వకారణమైన విశాఖ స్టీల్ప్లాంట్ను పరిరక్షించేందుకు పాదయాత్ర చేపడుతున్నానని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉక్కు ఉద్యమ పరిరక్షణ పాదయాత్ర సాగనుందన్నారు. ‘‘స్టీల్ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తూ.. ప్రైవేటీకరణ జరగకుండా పరిశ్రమను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. ప్లాంట్కు సొంత గనులు కేటాయించడంతో పాటు రుణాలను ఈక్విటీ రూపంలో మార్చాలని సీఎం కేంద్రానికి ప్రతిపాదించారని’’ ఆయన పేర్కొన్నారు.
ఒడిశాలో పుష్కలంగా ఉన్న ఇనుప ఖనిజానికి సంబంధించిన మైన్స్తో లీజు ఒప్పందాల్ని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. కార్మికులకు అండగా ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఉందనే భరోసాను విశాఖ ప్రజల్లో కల్పించేందుకుకు ఈ పోరాటయాత్ర చేస్తున్నామన్నారు. ఇప్పటికే సంఘీభావం ప్రకటించిన వివిధ వర్గాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.