పల్నాడులో ప్రస్తుతం నెలకొని ఉన్న ప్రశాంత పరిస్థితులను చెడగొట్టేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఇక్కడి ప్రజలు ఎవరికి వారు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకుంటుంటే తెలుగుదేశం గూండాలు విజయవాడ నుంచి 10 కార్లలో ఇక్కడకు వచ్చారని ఆయన అన్నారు.
అతి వేగంగా వచ్చిన ఆ గూండాల కార్లలో ఒకటి ఒక పిల్లాడికి తగిలిందని తెలిపారు. దీంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారని, వారిని సముదాయించాల్సింది పోయి టీడీపీ నాయకులు బోండా ఉమతో సహా ఇతర నాయకులు దుర్భాషలాడటం సరికాదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నదే టీడీపీ పథకమని ఆయన అన్నారు. అందులో భాగంగానే 10 కార్లతో వచ్చి కావాలనే గొడవకు దిగారని అన్నారు.
ప్రజా బలం లేని చంద్రబాబు శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ఆ ఘటనలను తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఇదే పల్నాడులో 2014 స్థానిక ఎన్నికల సందర్భంగా అంబటి రాంబాబు, ముస్తాఫాలపై దాడులు చేసి చంపడానికి యత్నించారని గుర్తు చేశారు.
మొన్నటికి మొన్న రైతుల ముసుగులో తనపై హత్యయత్నానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అయినా సరే తాము సంయమనంతో వ్యవహరించామని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు.