విజయవాడలోని ఒక జ్యువెలర్స్ దుకాణంలో జరిగిన చోరీ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. సాయి చరణ్ జ్యుయలర్స్ కు చెందిన రూ.4 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలు చోరీ అయ్యాయి. గురుచరణ్ జ్యుయలర్స్ వారితో కలసి ఓ బిల్డింగ్ లో లాకర్ ఏర్పాటుచేసి బంగారం, వెండి, నగదును సాయి చరణ్ జ్యుయాలర్స్ అధినేత అందలో ఉంచారు.
సొత్తు ఉంచిన లాకర్ కు కాపాలాదారుగా రాజస్థాన్ కు చెందిన విక్రమ్ కుమార్ లోహియాను నియమించారు. శుక్రవారం ఉదయం రిలీవర్ వచ్చేసరికి విక్రమ్ కుమార్ చేతులు, కాళ్ళు కట్టివేసి, గాయాలతో వున్నాడు. చోరీ సంగతి తెలుసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా హుటాహుటిన తనిఖీలు ఆరంభించారు.
కాపలాదారుడి వ్యవహారశైలిపై అనుమానంతో సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించగా చోరీకి అసలు సూత్రధారి అతనేనని తేలింది. రెండు బ్యాగుల్లో సొత్తును ఉంచి భవనం వెనుక భాగం నుండి తరలించి, తనకు తానుగా గాయాలు చేసుకుని బంధించుకుని నాటకమాడాడు. విషయం తెలుసుకున్న గంటల వ్యవధిలోనే మెరుపువేగంతో కేసును ఛేదించి చోరీ సొత్తును స్వాధీనం చేసుకోగలిగామని సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు.
చోరీకి గురైన 7 కిలోల బంగారం, 19 కిలోల వెండి, 42 లక్షల నగదును పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. చోరీ కేసును గంటల వ్యవధిలో ఛేదించిన వన్ టౌన్ సీఐ పి.వెంకటేశ్వర్లు తదితర అధికారులను ఆయన అభినందించారు.